జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రారంభం
జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రారంభం - ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం - జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను సోమవారం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో స్వీయ గణనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ జనగణనను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల గణన, రెండవ విడతలో జనాభా గణన నిర్వహిస్తారని వివరించారు.
ఆధునిక డిజిటల్ సాంకేతికత ద్వారా ఖచ్చితమైన, పారదర్శకమైన డేటా సేకరణ జరుగుతుందని, ఇందుకోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. జనగణన లో భాగంగా ఈ నెల 26 నుండి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించబడిందని, ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు జనాభా అధికారులు స్వీయ గణన చేసుకునే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
కలెక్టరేట్లో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు:
జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయాలలో జనగణన అవగాహన కోసం ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయబడినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ సెల్ఫీ పాయింట్ల వద్ద ఫోటోలు తీసుకొని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడం ద్వారా మరింత అవగాహన పెంపొందించవచ్చని సూచించారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ స్వయంగా సెల్ఫీ పాయింటును సందర్శించి ఫోటోలు దిగారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్ లత, జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాజ గౌడ్ మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు సెల్ఫీ పాయింటు దగ్గర ఫోటోలు దిగారు
స్వీయ గణన చేసిన జిల్లా కలెక్టర్:
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ స్వయంగా వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి స్వీయ గణన పూర్తి చేసినట్లు తెలిపారు. 5 నుండి 10 నిమిషాల్లో స్వీయ గణన పూర్తవుతుందని, అధికారులు మరియు వారి సిబ్బంది ముందుగా తొందరగా స్వీయ గణన పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రజలందరూ ఇదే విధంగా ముందుకు వచ్చి స్వీయ గణనలో ఉత్సాహంగా పాల్గొనాలని, వారి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్వయంగా మాట్లాడుతున్న వాయిస్ సందేశాల ద్వారా జనగణన ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. గ్రామాలు, పట్టణాలలో ఈ వాయిస్ సందేశాలను విస్తృతంగా ప్రసారం చేసి ప్రతి ఇంటికీ సమాచారం చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మే 10వ తేదీ వరకు https://sc.census.gov.in� వెబ్సైట్ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని తెలిపారు. ఒక కుటుంబానికి ఒక మొబైల్ నెంబర్ ఉపయోగించి 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసి సమీక్ష అనంతరం సమర్పించాలని సూచించారు. వివరాలు పూర్తి చేసిన తరువాత హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఐడీ నెంబర్ వస్తుందని, దానిని భద్రపరచుకోవాలని తెలిపారు.
మే 11వ తేదీ నుండి ఇండ్ల గణన అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీ నెంబర్ అందించాలని, అవసరమైతే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారులు వచ్చిన సమయంలో ప్రజలు సరైన, నిజమైన సమాచారం అందించాలని కోరారు.
జనాభా ప్రాతిపదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు అవుతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ స్వీయ గణనలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జిల్లా ప్రజలను కోరారు.


Comments
Post a Comment