విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు.. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి
- ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ విద్యార్థి సంఘం 'ఫీజు పోరు దీక్ష'
మద్దతు తెలిపిన బండారు దత్తాత్రేయ
తూఫాన్,హైదరాబాద్ :- రాష్ట్రంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 'ఫీజు పోరు దీక్ష' చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి ప్రాధాన్యతనిచ్చి బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ దీక్షకు పలు పార్టీల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ఎస్. మధుసూదనాచారి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఫీజులు రాక కాలేజీలు మేనేజ్మెంట్ సర్టిఫికెట్లు ఆపేస్తున్నాయని, దీనివల్ల విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థుల చదువుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, గిడుగు మహేష్ యాదవ్, తాటికొండ విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో బీసీ విద్యార్థులు, సంఘం కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



Comments
Post a Comment