దయానంద సరస్వతి ఆశయాలు యువతకు ఆదర్శం
- స్వామీజీ జయంతి సందర్బంగా బండారు దత్తాత్రేయ నివాళి.. సామాజిక చైతన్యానికి పిలుపు
తూఫాన్,హైదరాబాద్ :- ఆర్యసమాజ స్థాపకులు, మహోన్నత సంఘ సంస్కర్త స్వామి దయానంద సరస్వతి 202వ జయంతి వేడుకలు గురువారం రాంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్వామీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత సమాజాన్ని అజ్ఞానం నుంచి జ్ఞాన మార్గంలో నడిపించిన మహానుభావుడు దయానంద సరస్వతి అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ‘వేదాలకు తరలండి’ అనే పిలుపుతో సమాజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత స్వామీజీకే దక్కుతుందని పేర్కొన్నారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం మరియు జాతీయ చైతన్యం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని గుర్తుచేశారు. దేశభక్తి, ధర్మం, నైతిక విలువలను ప్రజల్లో నాటిన ఆయన ఆశయాలను నేటి యువత ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. స్వామీజీ చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.


Comments
Post a Comment