గ్రామీణ వృత్తులకు మహర్దశ: 530 మందికి ఆధునిక యంత్రాల పంపిణీ!
గ్రామీణ వృత్తులకు మహర్దశ: 530 మందికి ఆధునిక యంత్రాల పంపిణీ!
● స్వయం ఉపాధితోనే దేశాభివృద్ధి.. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
● 2,384 ప్రాజెక్టులకు రూ. 73.58 కోట్ల మార్జిన్ మనీ విడుదల
(సికింద్రాబాద్ - తూఫాన్ బ్యూరో):
గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. శనివారం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఆధ్వర్యంలో నిర్వహించిన 'గ్రామోద్యోగ వికాస్ యోజన'లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు యంత్రాలు, టూల్కిట్లు అందజేశారు. మొత్తం 530 మంది కళాకారులకు కుట్టు మిషన్లు, మట్టి పనులు, చెప్పుల తయారీ, అగరబత్తి తయారీ తదితర వృత్తులకు సంబంధించిన 496 ఆధునిక పరికరాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "ఖాదీ ఫర్ నేషన్ - ఖాదీ ఫర్ ఫ్యాషన్" నినాదంతో స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ కల్పించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ద్వారా వలసలు తగ్గుతాయని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 2,384 ప్రాజెక్టులకు గాను రూ. 73.58 కోట్ల మార్జిన్ మనీని విడుదల చేశారు. ఈ ఏడాది తెలంగాణలో ఇప్పటికే 96 శాతం ఉపాధి లక్ష్యాలను సాధించామని, వనపర్తి జరీ క్లస్టర్ వంటి వాటికి పూర్తి మద్దతు ఇస్తున్నామని KVIC చైర్మన్ మనోజ్ కుమార్ వివరించారు.

Comments
Post a Comment