రామప్ప ఆలయాన్ని సందర్శించిన యునెస్కో భారత రాయబారి
రామప్ప ఆలయాన్ని సందర్శించిన యునెస్కో భారత రాయబారి
పారిస్ నుంచి వచ్చిన యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి శ్రీ విశాల్ వీ. శర్మ 2025 డిసెంబర్ 14న తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ వారసత్వ కేంద్రమైన రుద్రేశ్వర రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతోన్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు.
యునెస్కోకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్కు శ్రీ విశాల్ వీ. శర్మ చైర్మన్గా వ్యవహరించారు. ఈ కీలక పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్గార్డింగ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్కు కూడా ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే దీపావళిని యునెస్కోకు చెందిన ఐసీహెచ్ జాబితాలో చేర్చారు.
2021లో రాయబారి విశాల్ వీ. శర్మ సారథ్యంలోనే రామప్ప ఆలయం కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఇన్కోయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. పరిరక్షణ చర్యలను సమీక్షించేందుకు ములుగు జిల్లాలో పర్యటించారు. ఏఎస్ఐ నుంచి డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ హెచ్.ఆర్. దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజనీర్ శ్రీ కృష్ణ చైతన్య, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ రోహిణి పాండే-అంబేద్కర్, ఇన్కోయిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీ నాగోజీరావు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

Comments
Post a Comment