అక్షరసేద్యం.. కవితా గానం
బుక్ ఫెయిర్లో ఉర్రూతలూగించిన కవి సమ్మేళనం
ఆలోచింపజేసిన 'దుఃఖ నది'.. అలరించిన 'బలిపీఠం'
రెండు సెషన్లలో 30 మంది కవుల కవితా గానం
కవులకు సాహిత్య అకాడమీ నూతన సంవత్సర క్యాలెండర్ల పంపిణీ
హైదరాబాద్:- అక్షరాల నిధి.. పుస్తకాల కాణాచి అయిన 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం సాయంత్రం కవితా గానంతో ఉర్రూతలూగింది. ఎన్టీఆర్ స్టేడియంలోని అనిశెట్టి రజిత వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనం సాహిత్యాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, ప్రముఖ కవి యాకూబ్, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, పేర్ల రాములు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. రెండు సెషన్లుగా సాగిన ఈ సమ్మేళనంలో సుమారు 30 మంది కవులు పాల్గొని సమకాలీన అంశాలపై తమ కలాన్ని వినిపించారు.
హృదయాలను తాకిన కవితలు
సమ్మేళనంలో ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని పంచింది. 'మా నాన్న ప్రవహించే.. దుఃఖ నది' శీర్షికతో సాగిన కవిత అందరినీ ఆలోచింపజేయగా.. 'దక్షిణ భారతదేశానికి బర్రె ఆవుతో సమానం' అంటూ ద్రవిడ దేశంలో బర్రె ప్రాముఖ్యతను చాటిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేబుల్ టీవీ సంస్కృతిపై 'బలిపీఠం' పేరుతో ఒక వృద్ధ కవి వినిపించిన కవిత, టీవీ సీరియళ్లకు మహిళలు ఎలా బానిసలవుతున్నారో వ్యంగ్యంగా చెప్పడంతో సభికుల్లో నవ్వులు పూశాయి. 'కాలం పరిగెడుతోంది.. సంక్షోభంలో నేను', 'నీడ ఇంకా వేలాడుతోంది', 'తొవ్వ నేర్పిన కవిత్వం', 'గాజులు తొడుక్కున్నావా' వంటి కవితలు మనిషి అంతరంగ మథనాన్ని ఆవిష్కరించి శ్రోతల హృదయాలను తాకాయి.
కవులకు సన్మానం
ఈ సందర్భంగా కవులు మునాస వెంకట్, ఆనందచారి పాల్గొని కవి సమ్మేళనంలో పాల్గొన్న వారిని సన్మానించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలచారి ముఖ్య అతిథిగా విచ్చేసి కవులకు అకాడమీ తరపున నూతన సంవత్సర క్యాలెండర్లను అందజేశారు. కవిసమ్మేళనంలో హనీఫ్, స్వాతి శ్రీపాద, హిమజ, మేడిపల్లి రాజ్కుమార్, ఇబ్రహీం నిర్గన్, నిర్మలా రాణి తోట, ఎన్ లహరి, విఆర్ తూములూరి, రఘువీర్ ప్రతాప్, లావణ్య శైలేశ్వర్, తుమ్మల దేవరావు, గిరిధర్, సుంకర రమేష్జీ దేవేంద్ర, మోహన కృష్ణ, నక్క శ్రీనివాస్, సూకర కృష్ణ ప్రసాద్, గిన్నారపు ఆదినారాయణ, టి ఆర్ ఎల్ స్వామి, మేరెడ్డి రేఖ, అప్పు వెంకట నారాయణ తదితరులు పాల్గొని తమ కవితలను వినిపించారు.

Comments
Post a Comment